వివాదంలో అషు రెడ్డి... తండ్రి ఏమంటున్నారంటే..!

  • అషురెడ్డి రూ.9.5 కోట్ల మేర మోసం చేసిందంటూ ఆరోపణలు
  • స్పందించిన తండ్రి వెంకటకృష్ణారెడ్డి
  • అబ్బాయికి అప్పటికే పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని వెల్లడి
  • ఆర్థిక లావాదేవీలతో తమకు సంబంధం లేదని స్పష్టీకరణ
  • సోమవారం ప్రెస్ మీట్ పెట్టి తన కుమార్తె నిజాలు చెబుతుందన్న తండ్రి
బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై వచ్చిన రూ.9.5 కోట్ల మోసం ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదంపై అషురెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి తొలిసారిగా మీడియా ముందుకొచ్చి సంచలన విషయాలు వెల్లడించారు. తన కూతురు అమాయకురాలని, అసలు తప్పు అవతలి వారిదేనని ఆయన పేర్కొన్నారు. రేపు (సోమవారం) అషురెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వివరిస్తుందని తెలిపారు.

వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. "2021లో కాకినాడ నుంచి సత్యనారాయణ అనే వ్యక్తి ఫోన్ చేసి, అషురెడ్డికి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు. మా అమ్మాయి గురించి మీకెలా తెలుసు అని అడిగాను. మీ అమ్మాయికి, మా అబ్బాయి ధర్మేంద్రకు ఉద్యోగం చేసే దగ్గర పరిచయం అని ఆయన చెప్పారు. అయితే, మేము తెలిసిన వారి ద్వారా విచారించగా కొన్ని నిజాలు తెలిశాయి. అప్పటికే ధర్మేంద్రకు పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని, తండ్రి సత్యనారాయణ నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీపై కాల్ మనీ కేసు ఉందని తెలిసింది. దీంతో ఈ సంబంధం వద్దని నిర్ణయించుకున్నాం" అని వెంకటకృష్ణారెడ్డి వివరించారు.

ఆ తర్వాత వారి గురించి మళ్లీ ఇప్పుడే వింటున్నామని ఆయన అన్నారు. తన కూతురు తల్లి ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చిందని, ఆమెకు బయట ప్రపంచం గురించి పెద్దగా తెలియదని వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. "మా అమ్మాయి అమాయకురాలు. ఆమెపై వచ్చిన ఆర్థిక ఆరోపణల్లో వాస్తవం లేదు. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే నిరూపించుకోవాలి" అని ఆయన సవాల్ విసిరారు.

ప్రస్తుతం అషురెడ్డి వేరే ఊరిలో ఉందని, ఈ రాత్రికల్లా హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు. సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, ఈ వివాదం వెనుక ఉన్న అసలు నిజాలను అషురెడ్డే స్వయంగా వెల్లడిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో అషురెడ్డి ఏం చెప్పబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Ashu Reddy
Ashu Reddy controversy
Bigg Boss Ashu Reddy
Venkatakrishna Reddy
financial allegations
Satyanarayana
Dharmendra
Telugu actress
call money case
press meet

More Telugu News